కలం, వెబ్డెస్క్: తెలంగాణ (Telangana) రాజకీయాలపై సీ వోటర్ సర్వే (C-Voter Survey) సంచలన రిపోర్టు విడుదల చేసింది. ఈ సర్వే అధికార కాంగ్రెస్ (Congress) పార్టీకి షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా బలహీనపడి, తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఎనిమిది ఎంపీ స్థానాల నుంచి కాంగ్రెస్ బలం ఏకంగా నాలుగు సీట్లకు పడిపోయి సగానికి సగం నష్టపోయే ప్రమాదం ఉందని సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ, తెలంగాణలో మాత్రం అధికార పార్టీగా ఉండి కూడా వెనుకబడిపోతుండటం గమనార్హం.
మరోవైపు ఈ సర్వేలో బీజేపీ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటున్నట్లు తేలింది. ప్రస్తుతం ఉన్న 8 ఎంపీ స్థానాల నుంచి 9 స్థానాలకు బీజేపీ బలం పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. అలాగే గత కొంతకాలంగా డీలా పడిన గులాబీ పార్టీ క్రమంగా కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

