కలం, నిర్మల్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని (National Sports Day) పురస్కరించుకుని హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి వేడుకలను నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశాలతో జిల్లా యువజన, క్రీడల శాఖ, జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జిల్లా యువజన, క్రీడల అధికారి బి. శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. భారత హాకీకి ప్రపంచస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో మేజర్ ధ్యాన్ చంద్ చేసిన కృషి, ఆయన ప్రతిభ, అంకితభావం చిరస్మరణీయమని అన్నారు. ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం కావాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు క్రీడా కోటా ద్వారా ప్రభుత్వంతో పాటు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. యువత తమ ప్రతిభను గుర్తించి క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ రాథోడ్ లక్ష్మణ్, పీడీలు రమణారావు, రవీందర్ గౌడ్, అన్నపూర్ణ, భూమన్న, సత్తయ్య, బుచ్చిరామారావు, సుధార్ సింగ్, పోశెట్టి, వంశీ, కె. శ్రీనివాస్, పీఈటీలు సంజీవ్, గంగాధర్, ముకేష్, భీమేశ్, గిరి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, పాల్గొన్నారు.

