కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండలంలో పోలవరం ప్రధాన రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన వెంగళరావు, భద్రాచలం ఆర్టీసీ డిపోలో బస్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం బైక్ పై బూర్గంపాడు రోడ్డుపై వెళ్తుండగా గేదె అడ్డు వచ్చింది. గేదెను తప్పించబోయిన వెంగళరావు రోడ్డుపై పడిపోయాడు. దీంతో వెనుకనుంచి వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి కింద పడిపోయిన వెంగళరావు మీద నుంచి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆర్టీసీ డ్రైవర్గా నిత్యం రోడ్డు మీద అప్రమత్తంగా డ్రైవింగ్ చేసే వాడని, కానీ ఇప్పుడు ఆ రోడ్డు ప్రమాదంలోనే మరణించాడని స్థానికులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

