కలం, నల్లగొండ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు అంధకారంలో ఉందని, ఆ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందని విమర్శించారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి పార్టీలో చేరడం హరీశ్ రావుకు ఏమాత్రం ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. జీవన్ రెడ్డిని హరీశ్ రావు ఎప్పుడూ పార్టీలోకి ఆహ్వానించలేదని ఆరోపించారు. కేటీఆర్ మొదటిసారి జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఇంటికి వెళ్లినప్పుడు హరీశ్ రావు వెళ్లలేదని, రెండోసారి కూడా కేటీఆర్ బతిమిలాడితేనే హరీశ్ తోడుగా వెళ్లారని చెప్పారు.
కనీసం కేసీఆర్ (KCR) నివాసానికి జీవన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా హరీశ్ రావు కనిపించలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ (BRS) కుటుంబ రాజకీయాల్లో చీలక రాబోతోందని, ఇప్పటికే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతోందని, కేసీఆర్ ఏడాది తర్వాత ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంటే, అదే సమయంలో హరీశ్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే ఉందన్నారు. ఆయన అక్కడ ఎవరిని కలిశారనేది త్వరలోనే బయటపడుతుందని చామల బాంబు పేల్చారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం వల్ల ఆ పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని అభిప్రాయపడ్డారు.
‘జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అయినా కాంగ్రెస్ ఆయనకు సముచిత స్థానం ఇచ్చింది. కానీ బీఆర్ఎస్లో ఆయన కేవలం ఒక్కరోజు మాత్రమే విఐపీగా ఉంటారు’ అని చామల ఎద్దేవా చేశారు. గతంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేతల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని గుర్తుచేశారు. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని, కేసీఆర్ ఏడాదికి ఒకసారి పండుగలా బయటకు వస్తున్నారని చామల విమర్శించారు. జీవన్ రెడ్డిని చేర్చుకుని కాంగ్రెస్ బలహీనపడిందని భ్రమ కలిగించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందన్నారు. కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కూడా జీవన్ రెడ్డి రాక ఇష్టం లేదని చామల స్పష్టం చేశారు. హరీశ్ రావు భవిష్యత్ ప్రణాళికలు ఏంటో ప్రజలకు త్వరలోనే అర్థమవుతుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) చెప్పుకొచ్చారు.
Read Also: నరసింహ స్వామికే శఠగోపం.. యాదాద్రి ఆలయ ఆదాయానికి గండి!
Follow Us On: X(Twitter)

