కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తమిళనాడులో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంపై సీపీఐ నారాయణ (CPI Narayana) విమర్శలు గుప్పించారు. సోమవారం నారాయణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు (Tamil Nadu)లో డీఎంకే, లెఫ్ట్ పార్టీలు బలంగా నిలబడి బీజేపీని అడుగు పెట్టనివ్వడం లేదని చెప్పారు. డీఎంకే, లెఫ్ట్ పార్టీల ఐక్యతను ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు. ఈ సమయంలో ఏమీ చేయలేక మోదీకి చంద్రబాబు గుర్తొచ్చాడన్నారు. తమిళనాడు వెళ్లి, తెలుగు ప్రజలు ఉన్నచోట తమ కోసం ప్రచారం చేయాలని కోరితే చంద్రబాబు వెళ్లాడన్నారు. ఇక మోదీకి, చంద్రబాబుకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలుసునని నారాయణ వ్యాఖ్యానించారు.
తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు స్కూళ్లను బ్యాన్ చేసేందుకు తీర్మానం పెట్టారని నారాయణ గుర్తు చేశారు. అప్పుడు కమ్యునిస్ట్ పార్టీలు వ్యతిరేకించాయని తెలిపారు. అప్పట్లో తమిళనాడుకు చెందిన తెలుగు ప్రజలు వచ్చి జయలలితతో మాట్లాడాలని కోరితే చంద్రబాబు రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని తెలుగు ప్రజల దగ్గరికి వచ్చారని ప్రశ్నించారు. ప్రజలకు ఆపద వస్తే రాలేదు కానీ, మోదీకి ఆపద వస్తే చంద్రబాబు వచ్చాడని విమర్శించారు. చంద్రబాబుది పచ్చి అవకాశవాదం అని అన్నారు. తమిళనాడులో తెలుగు ప్రజలను మోసం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనన్నారు. చంద్రబాబు తీరును తమిళనాడు తెలుగు ప్రజలు అంగీకరించరని, ఆయనకు తీవ్ర అవమానం తప్పదని స్పష్టం చేశారు.

