బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ కరీంనగర్‌లో నిరసన

కలం, కరీంనగర్ బ్యూరో : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ (Karimnagar)లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ లో భారీ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ బండి సంజయ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాట్లాడారు. మైనర్ బాలికకు సంబంధించిన ఇంత తీవ్రమైన కేసు దేశవ్యాప్తంగా చర్చకు వస్తుంటే బండి సంజయ్ (Bandi Sanjay) ఇంకా పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోక్సో కేసులో నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలంటే వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారం ఉందని ఎవరూ చట్టానికి అతీతులు కాలేరన్నారు. సాధారణ ప్రజలకు ఒక న్యాయం, అధికారంలో ఉన్నవారికి మరో న్యాయం అనే పరిస్థితి వస్తే ప్రజలు సహించరు అని హెచ్చరించారు. రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా దర్యాప్తు జరగాలని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అనంతరం, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ మాట్లాడుతూ, బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ (Karimnagar) మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్‌, పలువురు నాయకులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమం నేపథ్యంలో తెలంగాణ చౌక్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.

Read Also: BRS చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారింది: రామ్‌చందర్ రావు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>