కలం, వెబ్డెస్క్: వైసీపీలో అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి. ఆ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda Anil Kumar) నేడు వైఎస్ జగన్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డిపై అనిల్ తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ ఇంటికి వెళ్లకుండా సజ్జల తనను అడ్డుకుంటున్నాడని పేర్కొన్నారు. సజ్జల అనుచరులైన కారుమూరి వెంకట్రామిరెడ్డితో తనను రౌడీ షీటర్ అని ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. తన అరెస్ట్కు సంబంధించి కోర్టు సైతం తనపై రౌడీ షీటర్ లేదని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తనను రౌడీ షీటర్ అన్న వారికి ఇప్పటికే కోర్టు నోటీసులు కూడా ఇచ్చిందని తెలిపారు.
తనను రౌడీ షీటర్ అన్నందుకు కారుమూరి వెంకట్రామి రెడ్డిని ప్రశ్నిస్తే, తాను పార్టీకి విరుద్ధంగా మాట్లాడలేదని సమాధానం ఇచ్చాడని అనిల్ ఓ కాల్ రికార్డింగ్ మీడియాకు వినిపించారు. పార్టీ మీడియా సెల్ శ్రీహరి చూస్తారని, సజ్జల అన్నింటిలో ప్రముఖ పాత్ర పోషిస్తారని కారుమూరి చెప్పాడన్నారు. తాను పార్టీ గైడ్ లైన్స్ దాటలేదని, తనకు వచ్చిన ఆదేశాల మేరకు మాట్లాడినట్లు చెప్పాడని తెలిపారు. తాను లండన్లో పీజీ చేసి, తన తండ్రి మరణానంతరం రాష్ట్రంలో రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తన వెంటే ఉంటానని వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రమాణం చేశానని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయంలో సొంత పార్టీ నేతలే తనను రౌడీ షీటర్ అని ముద్ర వేస్తున్నారని, తనను హేళన చేస్తున్న వారిపై పార్టీ కఠిన చర్యలు తీసుకోవాలని అనిల్ డిమాండ్ చేశారు.

