కలం, కరీంనగర్ బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ‘లేట్ కామర్స్’పై తీసుకున్న చర్యలు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగంలో రైళ్లను పరుగెత్తిస్తున్నాయి. ఉదయం 10.30 దాటితే గేట్లు మూసేసి ఉద్యోగులను బయటే నిలిపివేసిన తీరు సామాన్యుల నుంచి హర్షం వ్యక్తం అవుతుంటే, కరీంనగర్ కలెక్టరేట్లోనూ అదే తరహా ‘సర్జికల్ స్ట్రైక్’ జరగాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు.
బయోమెట్రిక్ ‘గేమ్స్’.. ఖాళీగా కుర్చీలు!
ప్రభుత్వ కార్యాలయాల్లో (Karimnagar Collectorate) సమయపాలన కోసం ఐరిస్, బయోమెట్రిక్ యంత్రాలు ఏర్పాటు చేసినా ఉద్యోగుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఉదయాన్నే వచ్చి హాజరు వేసి మళ్లీ సొంత పనులకు వెళ్లడం, లేదా తమకు తోచిన సమయానికి వచ్చి సాయంత్రం వేళల్లో నిర్దేశిత సమయం కంటే ముందే జారుకోవడం ఇక్కడ మామూలైపోయింది. యంత్రాల్లో రికార్డవుతున్న అటెండెన్స్కు, సీట్లలో సిబ్బంది ఉండటానికి అస్సలు పొంతన ఉండటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పల్లె జనం పరేషాన్..
వివిధ గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి చార్జీలు పెట్టుకుని అర్జీలు ఇచ్చేందుకు వచ్చే పేద ప్రజలకు అధికారుల అలసత్వం శాపంగా మారింది. ఉదయం 11 గంటలైనా సీట్లలో అధికారులు కనిపించకపోవడంతో గంటల తరబడి కలెక్టరేట్ ఆవరణలోనే వేచి చూడాల్సి వస్తోంది. ఒక చిన్న సంతకం లేదా ధ్రువపత్రం కోసం పదే పదే కలెక్టరేట్ చుట్టూ తిరగలేక సామాన్యులు తీవ్ర అరిగోస పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న రెవెన్యూ, సంక్షేమ శాఖల్లో ఈ ‘లేట్ కల్చర్’ మరీ ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి.
కరీంనగర్లోనూ కొరడా ఝుళిపించేనా?
ప్రజా సమస్యల పరిష్కారానికి నిలయమైన కలెక్టరేట్లోనే పర్యవేక్షణ లోపిస్తే, ఇక మండల, క్షేత్రస్థాయి కార్యాలయాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, యాదాద్రి జిల్లా మోడల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కరీంనగర్ కలెక్టరేట్లో సమయపాలన గాడిలో పడదని స్పష్టం చేస్తున్నారు.
వివిధ గ్రామాలు, దూర ప్రాంతాల నుంచి అర్జీలు, ధ్రువపత్రాలు, సంక్షేమ పథకాల సమస్యల పరిష్కారం కోసం వచ్చే సామాన్యులు గంటల తరబడి కలెక్టరేట్లోని విభాగాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సకాలంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో, ఒక చిన్న పనికి కూడా ప్రజలు పదే పదే కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న శాఖల్లోనే ఈ అలసత్వం మరింత ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి.
కఠిన చర్యలకు డిమాండ్..
ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర బిందువైన కలెక్టరేట్లోనే సమయపాలన గాడి తప్పుతుంటే.. ఇక మండల, క్షేత్రస్థాయి కార్యాలయాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి జిల్లా తరహాలోనే కరీంనగర్ జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి సారించి, లేట్ గా వచ్చే ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

