కలం, ఆదిలాబాద్: వినాయక నవరాత్రుల సందర్భంగా శుక్రవారం భోరాజ్ మండలం రాంపూర్(టి) గ్రామంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) గ్రామంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మండపంలో 2,100 దీపోత్సవ వేడుకలను మొదటి జ్యోతి వెలిగించి ప్రారంభించి, గ్రామ ప్రజలతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాంపూర్ గ్రామంలో ఇంత ఘనంగా, నిష్టతో గణేష్ ఉత్సవాలు జరగడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా కొనియాడారు. ప్రకృతి పూజతో సంస్కృతి పరిరక్షణ ఉంటుందన్నారు. మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడం మన సంప్రదాయమని, ఇదే స్ఫూర్తిని జిల్లాలోని మిగతా గ్రామాలు సైతం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధికి యంత్రాంగం తరఫున పూర్తి సహకారం ఉంటుందని భరోసా కల్పించారు.

