కలం, వెబ్ డెస్క్: జనసేన(JanaSena)ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetty Satyanarayana) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఉన్న అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు బొలిశెట్టి ఓ లేఖ రాశారు. గత కొద్ది కాలంగా బొలిశెట్టి పార్టీ అంతర్గత వ్యవహారాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమిలో జనసేనకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బహిరంగంగానే మాట్లాడుతున్నారు. అలాగే ఓ కేసుకు సంబంధించి పర్యావరణ శాఖను ప్రతివాదిగా చేర్చారు. ఈ శాఖ బాధ్యతలు పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పర్యావరణ విభాగం ప్రధాన కార్యదర్శి సహా పలు అనుబంధ సంఘాల పదవులకు రాజీనామా చేస్తున్నట్లు బొలిశెట్టి తెలిపారు. పార్టీలో తన కార్యక్రమాలకు సైతం తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు పవన్ కల్యాన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కాలుష్యానికి సంబంధించి హైకోర్టులో దాఖలైన ఒక ప్రధాన పర్యావరణ పిల్లో బొలిశెట్టి పిటిషనర్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాను పార్టీ పదవులకు నైతిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా, అధికార కూటమిలో కీలక నేతగా ఉన్నందున ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకోవడం అవసరమని వ్యాఖ్యానించారు. తన న్యాయ పోరాటం రాజకీయ కారణాల వల్ల ప్రభావితం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. ఇది పార్టీ పదవి నుండి తాత్కాలిక విరామం మాత్రమేనని, రాజీనామా కాదని బొలిశెట్టి స్పష్టం చేశారు. న్యాయపరమైన పరిష్కారం లభించిన తర్వాత అధిష్టానం కోరుకుంటే పార్టీ బాధ్యతలు తీసుకుంటానని తెలిపారు.


