కలం, మెదక్ బ్యూరో: దుబ్బాకలో రోడ్ల అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) సవాల్ విసిరారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ రోడ్లు వేశారో మంత్రి చూపించాలి. రోడ్ల అభివృద్ధిని నిరూపిస్తే, 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మీరు సవాల్ను స్వీకరించేందుకు సిద్ధమా?” అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.
బుధవారం దుబ్బాకలో ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి జరిగినట్లు కోమటిరెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో అనేక రహదారులు గుంతలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థులు, రైతులు, వాహనదారులు నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గుర్తుచేశారు.

