కలం, వెబ్ డెస్క్ : కొన్ని రోజులగా పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులువు కాదని చెప్పారు. తాను, బొడిగె శోభ పార్టీ మారుతున్నారనే ప్రచారం వాస్తవం కాదని ఖండించారు. తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. తమ పార్టీలో కొందరు ఈ అంశానికి ఊతమిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదవులు ఆఫర్ చేసినా కాంగ్రెస్ లోకి వెళ్లలేదని తెలిపారు. కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి బయటకు నెట్టి ఐదేళ్లు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియాను చెర బట్టి తనపై కేసీఆర్ అనేక అవాస్తవాలను ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలానే వ్యవహరిస్తోందని ఈటల ఆరోపించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదల ఇండ్లు కూలగొడుతుందని, కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. త్వరలోనే రాష్ట్ర సర్కార్ పై ఉద్యమం చేస్తామని ఈటల రాజేందర్ హెచ్చరించారు.

