కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల విషయమై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వెనుక పెద్ద ‘డీల్’ ఉందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి బయటపడకుండా ఉండేందుకే, కేసుల భయంతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన కూడా కేసీఆర్ మార్గంలోనే సాగుతోందని ఎంపీ ఆరోపించారు. తాము వ్యవస్థల ప్రక్షాళన కోసం పోరాడుతున్నామని, తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని ధర్మపురి అరవింద్ క్లారిటీ ఇచ్చారు.
రాబోయే రోజుల్లో బీజేపీ (BJP) భూస్థాపితం అవుతుందంటూ కవిత వ్యాఖ్యలపై కూడా అరవింద్ ఘాటుగా స్పందించారు. బీజేపీని అంతం చేయడం ఎవరి తరం కాదని, ప్రజలే తమ వెన్నంటి ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొనుగోలు రాజకీయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.


