కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ (Mandula Samuel) ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) తీవ్రంగా స్పందించారు. జూబ్లీహిల్స్ వదిలి వెంటనే వెళ్లిపోవాలంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యేపై తెలంగాణ డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బతకాలంటే ప్రత్యేక పాస్పోర్ట్, వీసా కావాలా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను అవమానించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. సాక్షాత్తు పొరుగు రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంలకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం మనుషుల మధ్య చిచ్చు పెట్టి మంచి రాష్ట్రాన్ని నాశనం చేయవద్దని హితవు పలికారు.

