కలం, హనుమకొండ: ఎమ్మెల్యే అల్లుడు చెబితే అరెస్ట్ చేస్తారా..? అంటూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి రావు పద్మ రెడ్డి (Rao Padma Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు అర్ధరాత్రి యువకులను అరెస్టు చేయడం దారుణమన్నారు. బన్నీ, బంటి, రాహుల్ అనే యువకులను అరెస్టు చేశారనే సమాచారం తెలుసుకున్న రావు పద్మ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్తో కలిసి హనుమకొండ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. యువకుల అరెస్టుపై సీఐని ప్రశ్నించి నిరసన వ్యక్తం చేశారు.
సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి..
అనంతరం పోలీస్ స్టేషన్ బయట రావు పద్మ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేను గౌరవిస్తామని, ఆయన అల్లుడి పెత్తనం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అల్లుడు చెప్పాడని హనుమకొండ సీఐ హిందూ యువకులను వేధిస్తున్నారని ఆరోపించారు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన యువకులను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకునే హక్కు ఉందని రావు పద్మ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా హిందువుల హక్కుల కోసం బీజేపీ పోరాడుతుందన్నారు. పోలీసుల నిరంకుశ వైఖరి ఇలాగే కొనసాగితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

