కలం, వెబ్ డెస్క్ : ఏపీలో ఎండ తీవ్రత(AP Heatwave)తో పాటు వడగాలులు ముదురుతున్నాయి. దీంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఇంట్లో నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడే పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం పిడుగులాంటి వార్త చెప్పింది.
రానున్న వారం రోజుల పాటు ఎండ తీవ్రత భారీగా పెరగనుందని వెల్లడించింది. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మిగిలిన కొన్ని కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా ఈ వారం రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

