కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ–కర్ణాటక సరిహద్దు (Telangana-Karnataka Border) ప్రాంతాలలో చెత్త డంపింగ్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా నుంచి సేకరించిన చెత్తను (Bidar Garbage) తెలంగాణ సరిహద్దు గ్రామాల వద్ద డంప్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బీదర్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన వ్యర్థాలను తెలంగాణలోని న్యాల్కల్ మండలం పరిధిలోని గ్రామాల సమీపంలో పడేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మల్గి గ్రామం పరిసరాలలో తీవ్రమైన దుర్వాసన వ్యాపించడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
కర్ణాటక నుంచి చెత్త తీసుకొచ్చిన వాహనాలను తెలంగాణ సరిహద్దు గ్రామస్థులు అడ్డుకున్నారు. “మా గ్రామాలను చెత్త కుప్పలుగా మార్చొద్దు” అంటూ గ్రామ ప్రజలు డంప్ యార్డ్ వద్ద నిరసన చేపట్టారు. స్థానికుల అడ్డంకులతో చెత్త లోడుతో వచ్చిన వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో బీదర్ జిల్లా అధికారులు, పోలీసులు మల్గి గ్రామానికి చేరుకుని గ్రామస్థులపై బెదిరింపులకు పాల్పడ్డారు. భారీగా చేరుకున్న స్థానికులు, అధికారులు వెంటనే చెత్త వాహనాలను వెనక్కి పంపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

