కలం, భూపాలపల్లి : భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలోని వేషాలపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కడారీ సమ్మయ్య (60) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం రాత్రి తన ఇంటి వెనుక భాగంలో ఉన్న మేకల మంద వద్ద కాపలా కాసేందుకు ఆయన పడుకున్నాడు. అయితే, తెల్లవారేసరికి ఆయన నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమ్మయ్య మరణంపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వృద్ధుడి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.

