కలం, ఖమ్మం బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అకాల మృతి చెందడం పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. శుక్రవారం నర్సంపేటలోని ఆయన నివాసానికి చేరుకున్న పువ్వాడ అజయ్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలకు అంకితభావంతో సేవలందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. గత శాసనసభలో తామిద్దరం కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పెద్ది పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

