కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాస గిరి కాలనీలో వెంకటేశ్వరుడు కొలువై ఉన్న గుట్ట ప్రాంతాన్ని గొప్ప ఏకో టూరిజం (Eco Tourism) కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) హామీ ఇచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని శ్రీనివాసగిరి కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీసమేతంగా పాల్గొనగా, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రులకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు ఇద్దరూ వేరు వేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో వైభవంగా నిర్వహించబడింది. అనంతరం నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో మంత్రులు భక్తులతో కలిసి కార్యక్రమాన్ని భక్తి పారవశ్యంతో వీక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాసగిరి గుట్ట ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రకృతి వనంలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని అటవీశాఖ సహకారంతో అభివృద్ధి చేసి గొప్ప ఎకో టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

