కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10.14 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక (Flood Alert) ను జారీ చేశారు. రాబోయే గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులకు అత్యవసర సమాచారం అందించారు. ‘గోదావరి ఫ్లడ్ మ్యాన్యువల్’ నిబంధనల ప్రకారం వరద విధుల్లో ఉన్న అధికారులందరూ తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, అలర్ట్గా ఉండాలని ఆదేశించారు.
ముఖ్యంగా చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాల తహశీల్దార్లు, స్థానిక పోలీసు అధికారులు తమ తమ పరిధులలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, డివిజనల్ అధికారులు, సెక్టోరల్ ఆఫీసర్లు, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కంట్రోల్ రూమ్లు, సబ్ కంట్రోల్ రూమ్ల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

