కలం, హనుమకొండ: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించడమే కాకుండా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నిలిచారని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన పోషించిన పాత్రను ఎన్నటికీ మరువలేమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆయన ఆకస్మిక మరణం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

