కలం, దమ్మపేట: మాదకద్రవ్యాల విక్రయాలు, పేకాట, కోడిపందాలు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohit Raju) స్పష్టం చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ను సందర్శించారు. గంజాయి రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ సత్వర న్యాయం అందించాలన్నారు. పెండింగ్లో ఉన్న దొంగతనం కేసులను వేగవంతంగా ఛేదించాలన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు చోరీకి గురైన సొత్తు రికవరీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలను నిరంతరం చైతన్యపర్చాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన ఎస్పీ, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ ఆర్. సతీష్ కుమార్, సీఐ నాగరాజు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

