కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, సుజాతానగర్ మండలం మర్రి తండ గ్రామంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) బుధవారం సమగ్రంగా పరిశీలించారు. గ్రామంలో మొత్తం 99 ఇళ్లకు అనుమతులు మంజూరు కాగా, అందులో 65 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లను ప్రత్యక్షంగా సందర్శించి నిర్మాణ నాణ్యత, పనుల పురోగతిని సవివరంగా పరిశీలించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఇప్పటి వరకు జరిగిన వ్యయం, ప్రభుత్వం నుండి విడుదలైన నిధులు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే లేబర్ చార్జీలు ఎంత అవుతున్నాయి, అదనంగా లబ్ధిదారులు ఎంత మొత్తం వెచ్చిస్తున్నారు వంటి అంశాలపై ప్రశ్నించి సమగ్ర సమాచారం సేకరించారు. ఈ క్రమంలో మూడ్ మౌనిక, హాథిరాం, భూక్య అమల, భూక్య సునీత, భూక్య పంతులీ తదితర లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించారు.
ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనల ప్రకారం జరుగుతుందా? లేదా? అని అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఇళ్ల విస్తీర్ణం, నిర్మాణ పరిమాణాన్ని అధికారులతో టేప్తో కొలిపించి నిర్ధారించారు. ఎలాంటి నాణ్యత లోపాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, గృహ నిర్మాణ శాఖ ఏఈ లాల్ సాబ్, పంచాయతీ సెక్రటరీ విజయలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

