Mobile Popup Ad
Mobile Popup Ad

ఆదివాసీలకు అండగా.. భద్రాచలం పోలీసుల ‘కమ్యూనిటీ కనెక్ట్’!

కలం, ఖమ్మం బ్యూరో : వలస ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భద్రాచలం డీఎస్పీ (Bhadrachalam DSP) అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు గురువారం దుమ్ముగూడెం (Dummugudem) మండలం గద్దమడుగు గోత్తికోయ గుంపు, కొత్తపల్లి గ్రామాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘కమ్యూనిటీ కనెక్ట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులు, యువత చదువు ద్వారానే ఉన్నత స్థానాలకు చేరుకోగలరని, ఆదివాసీలకు కనీస సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. వర్షాకాలంలో మురుగునీరు చేరి దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

​అలాగే గంజాయి, మత్తు పదార్థాల దుష్ప్రభావాలను వివరిస్తూ.. అక్రమ రవాణాపై సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్తులకు గృహ అవసర వస్తువులను, పిల్లలకు పలకలు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ స్పెక్టర్ వెంకటప్పయ్య, ఎస్సై జగన్మోహన్ చారి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>