కలం, వెబ్ డెస్క్: భారత ఫుట్బాల్ అత్యంత కఠినదశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బెంగళూరు ఎఫ్సీ (Bengaluru FC) ఆటగాళ్లు జీతాల కోతకు అంగీకరించారు. ఇండియన్ సూపర్ లీగ్ సీజన్ ప్రారంభానికి ముందు సీనియర్ ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు క్లబ్ యజమాని పార్థ్ జిందాల్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. పరిపాలనా, ఆర్థిక సమస్యలతో నాలుగు నెలలకుపైగా నిలిచిపోయిన ఐఎస్ఎల్ ఫిబ్రవరి 14 నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
ఈ సమయంలో క్లబ్, క్రీడ ప్రయోజనాలకే ఆటగాళ్లు ప్రాధాన్యం ఇచ్చారని జిందాల్ తెలిపారు. ఇది క్లబ్కు తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయాల్లో ఒకటని పేర్కొన్నారు. గత నెలలోనే లీగ్ అంతటా ఆటగాళ్లు త్యాగాలు చేయాలని జిందాల్ పిలుపునిచ్చారు. అలా చేయకపోతే కొన్ని క్లబ్లు మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని అప్పట్లో హెచ్చరించారు.
బెంగళూరు ఎఫ్సీ జట్టులో సునీల్ ఛెత్రి, గూర్ప్రీత్ సింగ్ సందూ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. సీజన్ పునఃప్రారంభానికి ముందు మాజీ భారత ఆటగాడు రినేడీ సింగ్ను హెడ్ కోచ్గా నియమించారు. ఇదే బాటలో ఎఫ్సీ గోవా కూడా జీతాల కోతకు అంగీకరించినట్లు ప్రకటించింది. జట్టు ఐక్యతను క్లబ్ ప్రశంసించింది.
డిసెంబర్ 8న మాస్టర్ రైట్స్ ఒప్పందం రద్దుతో ఐఎస్ఎల్ సంక్షోభం మొదలైంది. ప్రభుత్వ జోక్యంతో 14 క్లబ్లు సవరించిన సీజన్కు అంగీకరించాయి. ప్రతి జట్టు 13 మ్యాచ్లు ఆడనుండగా, మొత్తం 91 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ నిర్వహణ ఖర్చుల్లో సుమారు 60 శాతం క్లబ్లే భరిస్తాయి.


