ఎన్ని విమర్శలు వచ్చినా.. మా లక్ష్యం ఒక్కటే: స్టోక్స్

కలం, స్పోర్ట్స్​ : ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో పరిస్థితులు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్‌లో 4-1 తేడాతో ఓటమి పాలైన తర్వాత టీమ్ హెడ్ కోచ్, కెప్టెన్ బెన్ స్టోక్స్‌ (Ben Stokes)పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒకరిపై వేటు వేయాలన్న వారు చాలా మందే ఉన్నారు. దాంతో ఈ అంశంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక సమీక్ష చేపట్టింది. అందరి అభిప్రాయాలు తీసుకోవాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జట్టులో విమర్శలు వస్తున్నప్పటికీ, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్‌తో తన భాగస్వామ్యాన్ని ఆయన గట్టిగా సమర్థించారు. భవిష్యత్తులో తమ పనితీరులో స్వల్ప మార్పులు ఉండవచ్చని, కానీ జట్టు గెలుపే తమ అంతిమ లక్ష్యమని స్టోక్స్ స్పష్టం చేశారు. ఇటీవలి ఓటమి తర్వాత కెప్టెన్, కోచ్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను స్టోక్స్ కొట్టిపారేశారు. వారిద్దరి మధ్య అవగాహన లోపించిందనే మాటలు వాస్తవం కాదని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు ప్రతి విషయంలో ఏకీభవించడం అసాధ్యమని, 95 శాతం విషయాల్లో తాము ఒకే మాటపై ఉంటామని చెప్పారు. మిగిలిన 5 శాతం భిన్నమైన ఆలోచనలు ఉన్నప్పుడు చర్చల ద్వారా ఒకే నిర్ణయానికి వస్తామని వివరించారు.

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) నిర్వహించిన సమీక్ష తర్వాత, వీరిద్దరూ తమ పదవుల్లో కొనసాగుతారని ఖరారైంది. వచ్చే 2027 హోమ్ యాషెస్ సిరీస్ వరకు స్టోక్స్ కెప్టెన్‌గా ఉంటారు. అలాగే 2027 ప్రపంచ కప్ వరకు మెక్కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. గత నాలుగేళ్లుగా జట్టు కోసం తాము ఎంతో శ్రమించామని, మెక్కల్లమ్ కాకుండా మరొకరితో కలిసి పనిచేయడం తాను ఊహించలేనని స్టోక్స్ వెల్లడించారు. గతంలో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని, రాబోయే నాలుగేళ్లలో జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఉద్దేశమని స్టోక్స్ (Ben Stokes) తెలిపారు. ఆటగాళ్లకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ, అన్ని టోర్నీల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాము తమ బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తామని, 2027 నాటికి అనుకున్న విజయాలను అందుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>