కలం, వెబ్డెస్క్: సాధారణంగా ఆలయాల్లో లడ్డూ, పులిహోర వంటి ప్రసాదాలు ఇస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం భక్తులకు ప్రత్యేకంగా డబ్బును ప్రసాదంగా అందిస్తారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం చిత్తోడ్గఢ్ జిల్లాలోని బారి సాద్రి సమీపంలో ఉన్న ‘బానోడా బాలాజీ’ ఆలయం (Banoada Balaji Temple) లో మాత్రం భక్తులకు డబ్బును ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఈ ఆలయంలో పంచముఖ హనుమాన్, శ్రీ కల్లాజీ రాథోడ్, జగన్నాథ్ స్వామి విగ్రహాలు ఉన్నాయి. అయితే ఏటా చైత్ర పూర్ణిమ, దీపావళి సమయంలో ఈ ఆలయంలో భక్తులకు నగదును ప్రసాదంగా పంచుతారు. ఈ ప్రసాదాన్ని భక్తులు లక్ష్మీ రూపంగా భావిస్తారు.
అయితే ఈ ఆలయంలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. అది ఏంటంటే భక్తులు సమర్పించే కానుకల్లో కొంత భాగాన్ని ఆలయ పూజారులు తిరిగి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. భక్తులు ఆ డబ్బును భద్రంగా దాచుకుంటే ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని, వ్యాపారాల్లో లాభాలు వస్తాయని అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలా ప్రసాదంగా వచ్చిన డబ్బును భక్తులు భద్రంగా దాచుకుంటారు. వారి కోరికలు నెరవేరిన తర్వాత, ప్రసాదంగా వచ్చిన డబ్బుకు మరికొంత జోడించి ఆలయానికి తిరిగి సమర్పిస్తారు. ఇది ఈ ఆలయంలోని ప్రత్యేక సంప్రదాయం.

