కలం, వెబ్ డెస్క్: చిత్తూరు (Chittoor) జిల్లా బంగారెడ్డిపల్లె (Bangareddy palli)లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లిదండ్రులు పిల్లలకు విషమిచ్చి, ఆ తర్వాత తామూ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దామోదర్, నిర్మల ఇద్దరు పిల్లలతో కలిసి బంగారెడ్డిపల్లెలో నివాసం ఉంటున్నారు. నిర్మల కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. మెదడు సంబంధిత వ్యాధికి చికిత్స చేయించుకుంటోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో దామోదర్, నిర్మల తమ పిల్లలు రాజేష్ (13), శ్రీవిద్య (11) లకు విషమిచ్చి, తర్వాత ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సకాలంలో ఎవరూ చూడకపోవడంతో నలుగురు మృతి చెందారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు దాము ఇంటికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లో ఓ సూసైడ్ నోట్ను గుర్తించారు. అందులో దాము తన ఏటీఎం పిన్, ఫోన్ పే పిన్ నంబర్లు రాశాడు. అంత్యక్రియలకు తన ఖాతా నుంచే డబ్బు వాడాలని కోరాడు. స్థానికులతో మాట్లాడిన అనంతరం ఈ కుటుంబ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

