కలం, కరీంనగర్ బ్యూరో: గత 10 ఏళ్ల యూపీఏ పాలనను, మోదీ 12 ఏళ్ల పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సూచించారు. అభివృద్ధి, సంక్షేమం, అవినీతి విషయంలో ఎవరి పాలన బాగుందో ఆలోచించాలన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రణాళిక బద్దంగా దేశాన్ని పాలిస్తున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని.. తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారని కొనియాడారు. దేశవ్యాప్తంగా మోదీ రెండున్నరేళ్లలో 12 లక్షల ఉద్యోగాలను అవినీతికి తావు లేకుండా మెరిట్ ప్రాతిపదికపైనే ప్రధాని మోదీ ప్రభుత్వం భర్తీ చేసిందని చెప్పారు.
దేశంలో రైతు ఆదాయాన్ని మోదీ ప్రభుత్వం రెట్టింపు చేస్తోందని బండి సంజయ్ అన్నారు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేకిన్ ఇండియా పేరుతో విదేశీ ఉత్పత్తులపై ఆధారపడకుండా స్వదేశీ ఉత్పత్తును ఎగుమతి చేసే స్థాయికి తీసుకొచ్చారని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏయే కార్యక్రమాలు చేపడితే ప్రజలకు మంచి జరుగుతుందో సూచనలు,సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే వివిధ వర్గాలను కలుస్తున్నామని అన్నారు. తెలంగాణ విషయానికొస్తే… 12 ఏళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలకుపైగా నిధులను కేంద్రం ఇచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లేనిపక్షంలో కేంద్ర నిధులు దారి మళ్లుతున్నాయని ఆరోపించారు. కేంద్ర సంక్షేమ పథకాలు కూడా దారి మళ్లే ప్రమాదం ఉందని అభిప్రాయడ్డారు. అందరికీ అధికారం ఇచ్చారని.. ఒక్కసారి బీజేపీకి అవకాశంఇవ్వాలని కోరారు.

