కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ శనివారం ఉదయం ‘అంజన్న ఆశీర్వాద యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ నుంచి నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ సహా ఆ పార్టీ ప్రజాప్రతినిధులంతా పాల్గొననున్నారు. రేపు ఉదయం 7 గంటలకు వీరంతా కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం వద్దకు చేరుకుంటారు. బండి సంజయ్తోపాటు కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ కాషాయ మయమైంది. ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’కు వచ్చే వారికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ఎండాకాలం ప్రారంభం కావడంతో కరీంనగర్లో 37 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మేరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొనేవారికి అవసరమైన మంచి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలను దారి పొడవునా అందుబాటులో ఉంచేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిమగ్నమై ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ (Anjanna Ashirvada Yatra)లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి ఢిల్లీ నుండి బయలుదేరి అర్ధరాత్రి సమాయానికి కరీంనగర్ చేరుకుంటారు. శనివారం ఉదయం 6 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం వద్దకు వెళతారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. మహాశక్తి ఆలయ ప్రాంగణం నుండే పాదయాత్ర ప్రారంభంకానుంది. ప్రధానంగా 10వ తరగతి విద్యార్ధులు పరీక్షలు జరుగుతున్నందున పాదయాత్ర సందర్భంలో రోడ్డుపై ట్రాఫిక్ జాం కాకుండా అంజన్న ఆశీర్వాద యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.

