కలం, వెబ్ డెస్క్ : కన్న పేగు బంధాలు కూడా డబ్బు ముందు పనికిరాకుండా పోతున్నాయి. ఆస్తికోసం కన్న తల్లిదండ్రులను కనికరం లేకుండా హింసిస్తున్న ఘటనలు అనేకం. ఇలాంటి అమానవీయ సంఘటనే నల్లగొండ జిల్లా వేములపల్లి (Vemulapally) మండలంలో చోటుచేసుకుంది.
బాధితుల వివరాల ప్రకారం.. మండలంలోని శెట్టిపాలెం గ్రామానికి చెందిన గగ్గనపల్లి బుచ్చిరెడ్డి, అనసూయ దంపతులు తమకు ఉన్న ఆస్తిని ఇద్దరు కుమారులకు సమానంగా పంచారు. అయితే తమ వైద్య ఖర్చుల కోసం మూడు ఎకరాల 11 గుంటల భూమిని తమను చూసుకుంటున్న మనవడి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
దీంతో పెద్ద కుమారుడి ఆగ్రహంతో ఆ భూమిలో కూడా వాటా ఇవ్వాలని తరచూ వేధింపులకు పాల్పడుతున్నాడని, తమను చంపేస్తానని, ట్రాక్టర్తో తొక్కిస్తానని బెదిరిస్తున్నాడని వృద్ధ దంపతులు చెబుతున్నారు. గతంలో వీల్చైర్లో ఉన్న తనపై పెద్ద కోడలు చెప్పుతో దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయినప్పటికీ, వేధింపులు మాత్రం ఆగలేదని తెలిపారు.
ప్రాణభయంతో వేములపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినా, ఎస్ఐ తమతో దురుసుగా ప్రవర్తించారని వారు ఆరోపించారు. దీంతో ఆర్డీవోను కలిసి రక్షణ కల్పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. అధికారులు తమకు రక్షణ కల్పించకపోతే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

