కలం, వెబ్ డెస్క్ : పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనలు, కీలక బిల్లులపై చర్చలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఎన్డీఏ (NDA) తన వ్యూహాలకు పదును పెట్టింది. పార్లమెంట్ చాంబర్లో మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ వీక్లీ స్ట్రాటజీ సెషన్ ‘మంగళ మిలన్’ సమావేశం (Mangal Milan Meeting) ప్రారంభమైంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎస్. జైశంకర్, కిరణ్ రిజిజులతో పాటు ఇటీవల ఎన్డీయే కూటమిలో చేరిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) అధ్యక్షురాలు కాకొలి ఘోష్ దస్తీదార్ ముందు వరుసలో కూర్చుని చర్చల్లో పాల్గొన్నారు.
గత జూన్ నెలలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీలు ఎన్సీపీఐలో విలీనం కావడంతో, ఆ పార్టీ అధికారికంగా ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయింది. ఈ విలీనం వల్ల లోక్సభలో ఎన్డీయే బలం దాదాపు 318 స్థానాలకు పెరగడమే కాకుండా, కూటమిలో బీజేపీ తర్వాత ఎన్సీపీఐ రెండో అతిపెద్ద భాగస్వామ్య పక్షంగా అవతరించింది. పరీక్షల సంస్కరణలు, నిన్న సభలో ప్రవేశపెట్టిన నూతన బిల్లుపై విపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార పక్ష నేతలు చర్చిస్తున్నారు.

