కలం, మెదక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎస్సీల భూములను గుంజుకొని తన తమ్ముడు కొండల్ రెడ్డికి దాదాపు రూ. 200 కోట్ల విలువైన భూమిని అక్రమంగా కట్టబెట్టారని, అలాగే తన అల్లుడు సత్యకు కూడా ఎస్సీ, ఎస్టీల భూములను దారాదత్తం చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. సిద్దిపేట (Siddipet) లో ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన పారిశ్రామిక, వ్యాపారవేత్తల అవగాహన సదస్సులో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. లగచర్లలో ఎస్సీ, ఎస్టీల భూములను బలవంతంగా లాక్కొని, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం కనీసం ఒక్క ఎకరం భూమి కూడా కేటాయించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల కేటాయింపుల్లో అక్రమాలు చేస్తుందని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారో చెప్పాలని నిలదీస్తే, ఈ ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాధానం లేదని దుయ్యబట్టారు.

