కలం, వెబ్ డెస్క్: పోక్సో కేసులో అరెస్టయి గత 42 రోజులుగా చర్లపల్లి జైల్లో ఉన్న బండి భగీరథ్ (Bandi Bhagirath) హైకోర్ట్ బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యాడు. భగీరథ్ను అతడి న్యాయవాదులకు జైలు అధికారులు అప్పగించారు. మైనర్ బాలికపై బండి భగీరథ్ అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అతడిపై పోక్సో కేసు నమోదు కాగా, మే 16వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జడ్జి ఆదేశాలతో చర్లపల్లి జైలుకు పంపించారు.
రెగ్యులర్ బెయిల్ మంజూరు..
మధ్యలో వారం రోజుల పాటు పరీక్షల కారణంగా, తాత్కాలిక బెయిల్ మీద బండి భగీరథ్ బయటకొచ్చాడు. పూర్తయిన వెంటనే కోర్ట్ ఆదేశాల మేరకు తిరిగి జైలుకు వెళ్లి లొంగిపోయాడు. ఈ క్రమంలో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ అతడి తరఫు లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ జరిపిన కోర్ట్.. రూ.లక్ష, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూర్ చేసింది. బెయిల్ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం, కాసేపటి కిందటే బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి బయటకొచ్చాడు.

