కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. సింగరేణి సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలని, కార్యాలయాలకు నిప్పుపెట్టాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసులు బాల్క సుమన్ను హిమాయత్నగర్లోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఈ కేసులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సింగరేణి సంస్థ ఆస్తులను ధ్వంసం చేయాలని, కార్యాలయాలపై దాడులు చేయాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల కారణంగా సింగరేణి ఉద్యోగుల భద్రతకు ముప్పు ఏర్పడిందని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ మేరకు జూనియర్ ఇన్స్పెక్టర్ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ఆనంద్ పోలీసులకు అందజేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ వీడియోలను కేసులో కీలక ఆధారాలుగా చేర్చినట్లు వెల్లడించారు. విచారణ సమయంలో వీడియోల్లో ఉన్న వ్యాఖ్యలను బాల్క సుమన్ (Balka Suman) కూడా అంగీకరించినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. ఆయనపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

