కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర గార్డెన్లో టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బీఎల్ఏలకు (BLA) అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఆదివాసి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగం నాయక్ (Lingam Naik) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా కృషి చేయాలని, అర్హత లేని పేర్లను గుర్తించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఖచ్చితమైన ఓటర్ల జాబితా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

