కలం, ఖమ్మం బ్యూరో: దేశంలో ప్రతి పది మంది మహిళల్లో ఆరుగురు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ శివనాథుల శ్రీనివాస్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణపై ఖమ్మం (Khammam) నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఆధ్వర్యంలో అవగాహన చేపట్టారు. వైరా రోడ్డులోని జీవి మాల్, ఇల్లెందుక్రాస్ రోడ్డులోని ఐటీ హబ్, అటవీ శాఖ ప్రధాన కార్యాలయంలోని మహిళా ఉద్యోగినులకు అవగాహన కల్పించారు. ఏఎస్సై జ్యోతి మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేవలం ఒక సమస్య కాదు, మహిళల గౌరవం, భద్రతకు ముప్పు అన్నారు. 2013లో వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ సెక్స్వల్ హెరాస్మెంట్ చట్టం ప్రకారం.. ప్రతి సంస్థలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీసీ) ఏర్పాటు చేయాలన్నారు. 3 నెలల లోపు ఫిర్యాదు చేయొచ్చని.. ఫిర్యాదు చేసిన 90 రోజుల లోపు సమస్య పరిష్కారం జరుగుతుందన్నారు. కమిటీ వద్ద పరిష్కారం లభించకపోతే కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.
మౌనం వీడాలని పిలుపు..
70 శాతం మంది మహిళలు భయంతో మౌనంగా ఉండిపోతున్నారని, దీన్ని ఛేదించాలని ఏఎస్సై జ్యోతి పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ, షీ టీం, భరోసా కేంద్రాల ద్వారా నిరంతరం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి సంస్థలో పోష్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఫిర్యాదుదారులు రహస్యంగా హెల్ప్లైన్ నంబర్లు 181, 100, 112ను ఉపయోగించి కూడా తెలుపవచ్చన్నారు. పని ప్రదేశంలో వేధింపులను నిరోధించి మహిళలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా దేశ ప్రగతిలో మహిళల పాత్రను మరింత కీలకంగా మార్చవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక కార్యకర్తలు, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: వినేష్ ఫోగట్ సెకండ్ ఇన్నింగ్స్.. కొత్త వెయిట్ కేటగిరీతో సిద్ధం!
Follow Us On: Instagram

