కలం, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వ్యవహారంపై మరోసారి ఏపీ శాసన మండలిలో తీవ్ర వివాదం తలెత్తింది. బుధవారం మాజీ సీఎం జగన్ (YS Jagan)పై చేసిన మత పర వ్యాఖ్యలను మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) మళ్లీ ప్రస్తావించారు. జగన్ క్రిస్టియనా? కాదా? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను మండలిలో ప్రశ్నించి 24 గంటలు దాటినా జగన్ నుంచి సమాధానం రాలేదన్నారు. గత వైసీపీ (YSRCP) ప్రభుత్వం ప్లాన్ ప్రకారమే టీటీడీ(TTD) ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించారు.
ఇప్పుడు లడ్డూ కల్తీలో వైసీపీ తప్పులు బయటపడుతున్నాయని మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారన్నారు. ఈ రాష్ట్రాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించారని, ఎన్నడూ తిరుమల దేవస్థానం ప్రతిష్ట దెబ్బతినలేదని, కావాలని కుట్ర చేసి జగన్ టీటీడీ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు పని చేశారని ఆరోపించారు. ఆ విషయాలు హిందూ సమాజానికి తెలియకుండా మళ్లీ కొత్త అంశాలను తెర ముందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం ఏర్పడింది.

