కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగుల(Govt Employees) వ్యక్తిగత నిబంధనలపై అస్సాం సర్కార్ (Assam Govt) సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ఉద్యోగులు షాకయ్యారు. ఇప్పటికే 2025లో అస్సోంలోని హిమంత బిశ్వశర్మ సర్కార్ బహు భార్యత్వ (Polygamy) వ్యతిరేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్లు జైలు శిక్ష వేస్తారు.
ఇక తాజాగా ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగంలో నుంచే తీసేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు నిబంధనలు అతిక్రమించిన వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందవని స్పష్టం చేసింది. నేడు అస్సాం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి జయంత మల్లా బారువా 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బహు భార్యత్వంపై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మహిళా సాధికారత, లింగ సమానత్వం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి క్రిమినల్ కేసుల్లో దొరికినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

