కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026లో (T20 World Cup) భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న మహా సంగ్రామానికి ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీక్ (Usman Tariq) బౌలింగ్ చర్చనీయాంశంగా మారింది. అతని విభిన్నమైన బౌలింగ్ శైలి, ముఖ్యంగా బంతిని విడుదల చేసే ముందు ఇచ్చే “పాజ్” (విరామం) బ్యాటర్లను గందరగోళానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin), తారీక్ను ఇరకాటంలో పెట్టే ఒక అద్భుతమైన ట్రిక్కును తన యూట్యూబ్ ఛానెల్లో వివరించారు.
తారీక్ బంతి వేసే ముందు క్రీజులో ఒక్క క్షణం ఆగుతున్నాడని, ఆ సమయంలో బ్యాటర్ క్రీజు నుంచి పక్కకు తప్పుకునే హక్కు ఉంటుందని అశ్విన్ పేర్కొన్నారు. బౌలర్ ఎప్పుడు బంతిని వదులుతాడో తెలియడం లేదని, అందుకే తాను పక్కకు జరిగానని బ్యాటర్ అంపైర్కు చెప్పవచ్చని సూచించారు. నిబంధనల పరిధిలోనే ఉన్న ఈ వ్యూహాన్ని అమలు చేయడానికి ఏ భారత బ్యాటర్ ధైర్యం చేస్తారో చూడాలని అశ్విన్ సవాల్ విసిరారు. బ్యాటర్లు పదే పదే ఇలా చేస్తే బౌలర్పై తీవ్ర ఒత్తిడి పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.
ముఖ్యంగా ఇలాంటి పెద్ద మ్యాచ్లో బ్యాటర్లు పక్కకు తప్పుకోవడం వల్ల తారీక్ తన రిథమ్ కోల్పోయే అవకాశం ఉందని అశ్విన్ (Ashwin) అభిప్రాయపడ్డారు. ఇది అంపైర్లకు కూడా పెద్ద తలనొప్పిగా మారుతుందని, సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో బౌలర్కే హెచ్చరికలు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. పాకిస్థాన్ ట్రంప్ కార్డ్ అయిన తారీక్ను ఎదుర్కోవడానికి ఇది ఒక సమర్థవంతమైన మానసిక వ్యూహం అని అశ్విన్ వివరించారు. ఈ చిట్కా భారత బ్యాటర్లకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆదివారం నాటి మ్యాచ్లో తేలిపోనుంది.
Read Also: అభిషేక్ శర్మ అంతా గుడ్డి కొట్టుడే: పాక్ ప్లేయర్
Follow Us On: Instagram


