కలం, వెబ్ డెస్క్ : ప్రముఖ సినీనటి, బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) (కొయ్య వెంకట అశ్విని రెడ్డి) కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు వాయిదాలు వేస్తూ రూ.9.35 కోట్లు కాజేసిన ఆరోపణలపై అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ వేశారు. తన వివరణ లేకుండానే కేసు వేశారని ఆమె ఆరోపించారు.
పెళ్లి పేరుతో తనను మోసం చేసి రూ. 9.35 కోట్లు కాజేసిందని లండన్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ వైవీ ధర్మేంద్ర ఇటీవల అషురెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదు చేశారు. లోన్లు తీసుకొని మరి అషురెడ్డికి ఖర్చు చేశానని బాధితుడు తెలిపాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన ప్రతిసారీ .. సూసైడ్ చేసుకుంటానని అషురెడ్డి హెచ్చరించిందని పేర్కొన్నాడు. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో అషురెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది.

