కలం, వెబ్ డెస్క్ : భారతదేశ రక్షణ రంగంలో నలభై ఏళ్లకు పైగా విశిష్ట సేవలందించిన భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) తన పదవీ కాలాన్ని విజయవంతంగా ముగించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బాధ్యతల నుండి తప్పుకుంటున్న సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఆయన పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) మాట్లాడుతూ, సైనిక్ స్కూల్ విద్యార్థి దశ నుండి దేశ అత్యున్నత సైనిక కమాండర్ స్థాయికి చేరుకోవడం వరకు సాగిన తన ప్రయాణం ఎప్పటికీ మరువలేనిదని గుర్తుచేసుకున్నారు. భారత సైన్యంలో నాలుగు దశాబ్దాల పాటు సేవ చేయడం తన జీవితంలో దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్మీ బలం కేవలం ఒక్క వ్యక్తి వల్ల వచ్చేది కాదని, సైనికులు, కమాండర్లు, అనుభవజ్ఞులు, వారి కుటుంబాలు, దేశ పౌరుల అచంచలమైన నమ్మకం వల్లే ఈ శక్తి లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన ప్రతి సైనికుడికి ఆయన ఈ సందర్భంగా జోహార్లు అర్పించారు.
గడిచిన రెండేళ్ల కాలంలో భారత సైన్యం ప్రతి రక్షణ రంగంలోనూ అప్రమత్తతను, సంసిద్ధతను చాటుకుందని జనరల్ ద్వివేది వివరించారు. ఉత్తర సరిహద్దుల్లో ‘ఆపరేషన్ స్నో లెపార్డ్’ కింద సైన్యం ప్రదర్శించిన పట్టుదల, పశ్చిమ సరిహద్దుల్లో ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా చూపిన సంయమనం మన రక్షణ రంగానికి అద్దం పడుతున్నాయని అన్నారు. జాతీయ భద్రత విషయంలో ఆర్మీ అత్యంత క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరించి ‘కొత్త సాధారణ స్థితి’ని (న్యూ నార్మల్) నెలకొల్పిందని కొనియాడారు. భవిష్యత్తు యుద్ధాలు మరింత సమగ్రంగా, రక్షణ విభాగాలు కలిసికట్టుగా పోరాడేలా ఉంటాయని, అందుకే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు ఒకే దృక్పథంతో, పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కలిసికట్టుగా ఆలోచించడం, నిర్ణయించడం, పోరాడడమే మన రక్షణ దళాల ప్రధాన దిశ అని స్పష్టం చేస్తూ తన వీడ్కోలు సందేశాన్ని ముగించారు.

