కలం, కరీంనగర్ బ్యూరో: ఫ్యూచర్ సిటీలో మంత్రి శ్రీధర్ బాబు అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ (Arepalli Mohan) మండిపడ్డారు. గురువారం కరీంనగర్లోని కెమిస్ట్ భవన్లో మీడియాతో మాట్లాడారు. శ్రీధర్ బాబుపై చేసిన ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే బహిరంగపరచాలని పేర్కొన్నారు. అవినీతిని రుజువు చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని, నిరూపించకుంటే జీవన్ రెడ్డి తప్పుకుంటారా? అని సవాల్ విసిరారు.
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
జీవన్ రెడ్డికి (Jeevan Reddy) ధైర్యం ఉంటే 2016 నుంచి మంథని ప్రాంతంలో ఇసుక దందా ఎవరు ప్రారంభించారో రుజువు చేయాలని ఆరెపల్లి మోహన్ (Arepalli Mohan) డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాను విచ్చలవిడిగా కొనసాగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా.. అని మండిపడ్డారు. నాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జీవన్ రెడ్డి.. ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబును (Sridhar Babu) టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
శ్రీధర్ బాబు నిజాయితీ గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. వామన్ రావు దంపతుల హత్య, మంథనిలో శాంతి భద్రతల లోపించడానికి ఎవరు బాధ్యులో జీవన్ రెడ్డికి తెలియదా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దళిత బంధు పథకాన్ని కేవలం హుజురాబాద్కు మాత్రమే ఎందుకు పరిమితం చేశారని ఆరెపల్లి మోహన్ ప్రశ్నించారు.
పుట్ట మధు ఇసుక దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్..
సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు తమ ఉనికి కోల్పోతున్నామని, సర్ పేరుతో నియోజకవర్గాల పర్యటన చేపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగకుతున్నారని మండిపడ్డారు. పుట్ట మధు ఇసుక దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్ అని, నేటికీ ఇసుక కాంట్రాక్టర్లు, రోడ్డు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి వంత పాడుతూ జీవన్ రెడ్డి మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు.
కాళేశ్వరంలో రెండు గేట్లు కుంగిపోతే ఏం నష్టం జరుగుతుందని హేళన చేస్తున్నారని విమర్శించారు. గ్రానైట్ క్వారీల్లో బ్లాక్ మెయిల్కు పాల్పడి వసూలు చేసింది కేటీఆర్, హరీశ్ రావు కాదా?.. అని ప్రశ్నించారు. శ్రీధర్ బాబు లాంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నరసయ్య, ఆర్జీపీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉప్పుల అంజన్ ప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అకారపు భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ తాజుద్దీన్, అర్బన్ బ్యాంకు ఛైర్మన్ కర్ర రాజశేఖర్, ఎన్.ఎస్.యు ఐ రాష్ట్ర నాయకులు పోతారం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

