కలం, వెబ్ డెస్క్ : ఏపీలోని మార్కాపురం (Markapuram Road Accident) జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంభం హైవేపై వెళ్తున్న పెళ్లి ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి కుమార్తె వీరక్క తో పాటు 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే మృతులను అలకనంద, అంకాలు, నగేష్, నాగేశ్వరిగా గుర్తించారు. వీరంతా గిద్దలూరు లోని నల్లబండ బజార్కి చెందిన వారు. మృతులంతా పెళ్లికూతురు కుటుంబ సభ్యులు. గిద్దలూరు నుంచి కంభంలో పెళ్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పెళ్లికూతురు కుటుంబ సభ్యులు చనిపోవడంతో.. పెళ్లి సందడి కాస్తా విషాదంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

