కలం, వెబ్ డెస్క్: అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 15 ఏళ్ల బాలికకు అబార్షన్ కేసు విచారణ సుప్రీంకోర్టు (Supreme Court) ముందుకు రాగా.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బాలిక 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అయితే ఈ తీర్పును విబేధిస్తూ దిల్లీ ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడంతో సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక అబార్షన్ విషయంలో తుది నిర్ణయం ఆమె, తల్లిదండ్రులదే తప్ప.. దిల్లీ ఎయిమ్స్కు ఎలాంటి అధికారం ఉండబోదని తేల్చి చెప్పింది.
బాధితురాలు మానసిక వేదన అర్థం చేసుకోరా..?
గర్భం దాల్చిన బాధితురాలు మానసిక వేదన ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఎయిమ్స్ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ఉద్దేశించి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ ప్రశ్నించారు. అయితే, ఈ సమయంలో అబార్షన్ చేస్తే బాలిక ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. అత్యాచార బాధితులు గర్భం దాల్చినప్పుడు ఏ సమయంలోనైనా అబార్షన్ చేసుకునేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తూ సీజేఐ విచారణను ముగించారు.

