కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై కేంద్రంతో చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా జలవనరుల అంశంతో పాటు పోలవరం పురోగతి, పునరావాసం, రెండోదశ పనులపై చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
అనంతరం ఢిల్లీలో నిర్వహించనున్న సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) వార్సిక సదస్సు సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. ఆయన వెంట మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర ఉన్నత అధికారులు హస్తినకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రాజకీయంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

