కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో దారుణ ఘటన వెలుగుచూసింది. కదులుతున్న రైలును లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని దుండగులు జరిపిన రాళ్ల దాడిలో ఒక రైల్వే ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. న్యూఢిల్లీ నుండి చెన్నై వైపు వెళ్తున్న గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 12616) ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండ (Singarayakonda) ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. చీకట్లో నక్కిన కొందరు ఉన్మాదులు ఒక్కసారిగా రైలు ఇంజన్ను లక్ష్యంగా చేసుకుని భారీ వస్తువులు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ చర్య వల్ల విధుల్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఎం. జయరామ్ తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో రైలును నియంత్రించడం కష్టతరంగా మారింది.
ప్రమాదాన్ని గమనించిన వెంటనే రైలును సమీపంలోని ఉలవపాడు (UPD) స్టేషన్లో అత్యవసరంగా నిలిపివేశారు. రక్తపు మడుగులో ఉన్న జయరామ్ను రైల్వే సిబ్బంది తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కదులుతున్న రైళ్లపై రాళ్లు రువ్వడం చట్టరీత్యా నేరమే కాకుండా, వందలాది మంది ప్రయాణికుల, రైల్వే సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలో పడేసే అత్యంత ప్రమాదకరమైన చర్య. ఈ ఘటనపై రైల్వే రక్షణ దళం (RPF), స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే దుండగులను కఠినంగా శిక్షించాలని, రైల్వే సిబ్బందికి రక్షణ కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

