కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) అత్యవసర మందులు, ల్యాబ్ శాంపిల్స్, చిన్న పార్సిళ్లను కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే డ్రోన్ల ద్వారా సరఫరా కానున్నాయి. బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ సంస్థ ‘ఎయిర్బౌండ్’ సహకారంతో ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ (APDC) అమరావతి రాజధానిలో ఈ నెట్వర్క్ను ఏర్పాటు చేస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమక్షంలో ఇరు సంస్థల ప్రతినిధులు ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సరికొత్త సేవలు మొదటగా గుంటూరు నగరంలో ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత రాబోయే ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఏకంగా 10,000 డ్రోన్ సర్వీసులను నడిపేలా ఈ ప్రాజెక్ట్ను విస్తరించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక ఆకాశ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పట్టణ ప్రాంతాలతోపాటు మారుమూల గ్రామాలకు కూడా నిమిషాల వ్యవధిలోనే వైద్య సేవలు అందుతాయి. ఈ రవాణా కోసం ‘ఎయిర్బౌండ్’ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన తేలికపాటి కార్బన్ ఫైబర్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. కేవలం 1.5 కిలోల బరువు ఉండే ఈ డ్రోన్లు గంటకు 40 మైళ్ల వేగంతో ప్రయాణించగలవు. ఇవి రవాణా ఖర్చులను భారీగా తగ్గించడమే కాకుండా, ఎక్కువ బరువును సులువుగా మోసుకెళ్తాయి. ఇప్పటికే 700కుపైగా విజయవంతమైన వైద్య పరీక్షలను పూర్తి చేసుకున్న ఈ డ్రోన్స్ త్వరలోనే సాధారణ ఆన్లైన్ డెలివరీలను అందించనున్నాయి.

