కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సంగమ ప్రాంతం అది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం. స్వాతంత్య ఉద్యమ స్ఫూర్తితో పోరాటంలో భాగస్వాములయ్యారు అక్కడి ప్రజలు. స్వాతంత్రం సిద్ధించాక అదే స్ఫూర్తిని కొనసాగించాలని పోరాట పటిమ, దేశభక్తిని భావి తరాలకు అందించాలని బిచ్కుందకు చెందిన ముగ్గురు స్నేహితులు సంకల్పించారు. భరతమాత(Bharat Mata Temple ) కు గుడి కట్టాలని నిర్ణయించారు. అనుకున్నట్టే 1950లో ఓ గుడిసెలో భరతమాత మట్టి విగ్రహంతో ఆలయం నిర్మించారు.
ఇలాంటి భరత మాత ప్రాచీన ఆలయాలు దేశంలో రెండే ఉండగా.. ఒకటి కాశీలో.. మరొకటి బిచ్కుందలో ఉండడం విశేషం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు అయిన సందర్భంగా భరతమాత గుడిపై ‘కలం’ ప్రత్యేక కథనం అందిస్తోంది.
నిత్యం దూప దీప నైవేధ్యాలు
వివరాల్లోకి వెళ్తే.. బిచ్కుందకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు పిశికే లక్ష్మయ్య 1950లో ఒక గుడిసెలో భరతమాత విగ్రహం ఏర్పాటు చేశారు. దాతలు భూమి ఇవ్వగా ఆయన తన ఇద్దరు స్నేహితులు నక్క రామన్న, అల్లే గంగారాం సహకారంతో ఆలయం నిర్మించారు. పద్మశాలి సంఘం నేతలు ముందుకు వచ్చి పెండింగ్ పనులు పూర్తి చేశారు. అప్పటి నుంచి భరతమాతకు దూప దీప నైవేద్యాలతో నిత్యం పూజలు చేస్తుండగా.. ప్రతి మంగళవారం ప్రత్యేక అభిషేకం జరుగుతోంది. ఇక్కడ ప్రతి శనివారం నిర్వహించే భజన సైతం ఆకట్టుకుంటుంది. రచ్చ శివకాంత్, గంగుల శ్రీనివాస్, రాజు, బాలరాజ్, పరమేశ్వర్ ఐదుగురూ కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. గ్రామస్తులందరూ సమష్టిగా ఆలయ అభివృద్ధి, దేశభక్తి పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దుర్గామాతగా గుర్తించి మొక్కులు
1982లో ఆలయానికి పూజారిని నియమించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడులను ఘనంగా నిర్వహించి జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. మూడేళ్ల కింద అమ్మవారికి పంచలోహ విగ్రహం తయారు చేయించారు. తమిళనాడులోని కుంభకోణంలో ప్రత్యేకంగా తయారు చేయించి తెచ్చి, ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. రూ. 40 లక్షల నిధులతో కొత్త ఆలయం నిర్మించారు. గ్రామానికి చెంది పెద్దలు, పిల్లలు అందరూ తోచినంత సాయం చేశారు. ఆలయానికి జై కొట్టారు. ఇప్పుడు భరత మాత దేవతగా మారింది. భక్తుల్లో నమ్మకం పెరిగింది. సంతానం, ఉద్యోగాలు, రాజకీయాలు ఇలా కోరిన కోర్కెలు నెరవేరుతున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మొక్కిన ప్రతి పని అవుతుండడంతో దుర్గామాతగా నమ్ముకున్నామని అంటున్నారు. ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా నిర్వహిస్తున్నారు.
భరతమాత కరుణ కటాక్షాలు తమపై ఉంటాయని .. బిచ్కుందలో పుట్టడం, గుడి నిర్మాణంలో పాలు పంచుకోవడం తమ అదృష్టం అని బిచ్కుందకు చెందిన రాజు అనే వ్యక్తి అన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భరత మాత అందరికీ అడిగినవన్నీ ఇస్తుందని.. చదువు, సంతానం ఉద్యోగాలు, రాజకీయ పదవులు ఇలా అన్నీ కోరుకుంటే నెరవేర్చుతుందని చెప్పుకొచ్చారు. బిచ్కుందకు చెందిన మరో వ్యక్తి శివకాంత్ మాట్లాడుతూ… భరత్ మాత మూడు రాష్ట్రాల భక్తులకు దుర్గాదేవి మాత అయ్యిందని చెప్పుకొచ్చారు. ప్రతి ఆషాఢంలో దుర్గా నవరాత్రి బోనాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. మూడేళ్ల కింద పంచ ధాతు విగ్రహంతో అమ్మవారిని తయారు చేయించి ప్రతిష్ఠించామని, నిర్మాణంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అని ఆనందం వ్యక్తం చేశారు. భరతమాతకు నిత్య పూజలు చేస్తూ.. భావితరాలకు దైవభక్తి, దేశ భక్తి రెండూ అందిస్తామని చెప్పారు.

